MANA SAMAJAM
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 12:31 am Posted by : MANA SAMAJAM DESK

తమిళనాడులో విజయ్ గెలుపుపై స్పందించిన కవిత

  • రాజకీయ చరిత్రను తిరగరాసేందుకు కొత్త శక్తులు అవసరమన్న కవిత
  • ఈ విషయాన్ని తమిళ ప్రజలు నిరూపించారన్న కవిత
  • ఈ దేశానికి తమిళ ప్రజలు ఒక సంకేతం పంపించారని వ్యాఖ్య

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ అధినేత్రి కవిత స్పందించారు. భ్రష్టుపట్టిపోయిన ఈ రాజకీయ చరిత్రను తిరగ రాయడానికి కొత్త రాజకీయ శక్తులు అవసరమని తమిళ ప్రజలు నిరూపించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.

“ఉన్న వాళ్లతో విసిగిపోయాం. అధికార దాహార్తులతో వేసారిపోయాం. భ్రష్టుపట్టిపోయిన ఈ రాజకీయ చరిత్రను తిరగ రాయడానికి ‘కొత్త రాజకీయ శక్తులు’ అవసరమని దేశానికి తమిళ ప్రజలు ఒక సంకేతం పంపారు” అని ట్వీట్ చేశారు. కవిత కూడా పది రోజుల క్రితం తన కొత్త పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త రాజకీయ శక్తుల అవసరాన్ని ప్రజలు గుర్తించారని అభిప్రాయపడ్డారు.

సాయంత్రం 4.30 గంటల సమయానికి టీవీకే పార్టీ 24 స్థానాల్లో నెగ్గి, 82 చోట్ల ఆధిక్యంలో ఉంది.  అధికార డీఎంకే 13 స్థానాల్లో నెగ్గి, 58 సీట్లలో ముందంజలో ఉంది. అన్నాడీఎంకే 10 సీట్లు గెలుచుకుని, 46 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచింది.